పేరు: అనుముల రేవంత్ రెడ్డి
పార్టీ: టీడీపీ (TDP) , కాంగ్రెస్ (Congress)
అనుముల రేవంత్ రెడ్డి (A.Revanth Reddy) తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool District) వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామంలో నవంబర్ 8, 1965లో జన్మించారు. తల్లిదండ్రులు అనుమల నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. భార్య గీతా, కుమార్తె నైమిష. రేవంత్ రెడ్డి ఏబీవీపీలో (ABVP) పనిచేశారు. హైదరాబాద్లోని ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి (Jaipal Reddy) మేనకోడలు గీతను వివాహమాడారు. అనంతరం పలు పార్టీల్లో కొనసాగిన ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం
బీజేపీ (BJP) నుంచి 2006లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించారు. ఆ తర్వాత 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ (Kodangal) నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీలోనే కొనసాగిన రేవంత్రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ నాయకుడిగా ఉన్నారు.
ఓటుకు నోటు కేసు (Note for Vote Case)
టీడీపీలో ఉన్నప్పుడు జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాగంగా ఒక స్టింగ్ ఆపరేషన్లో దొరికినందుకు గానూ అవినీతి వ్యతిరేక (ఏసీబీ) విభాగం పోలీసులు 2015 మేలో ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రెండు నెలల తర్వాత ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తిరిగి మల్కాజిగిరి (Malkajgiri Lok Sabha) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 26 జూన్ 2021 నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా కొనసాగుతున్నారు.